Friday, September 24, 2010

ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ మార్కెట్ వాటా

గడిచిన వారం ( సెప్టెంబర్ 12 నుండి 18 వరకు ) నాన్-న్యూస్ చానల్స్ మార్కెట్ వాటా ఇలా ఉంది. ప్రసారాలే లేని ఆర్ టీవీ కి ఈవారం కూడా కొంత మార్కెట్ వాటా కట్టబెట్టారు టామ్ అధికారులు.
————————————————————————————————————–————————————
చానల్                      హైదరాబాద్           విశాఖ పట్నం            చిన్న                 మొత్తం
                                                             విజయవాడ             పట్టణాలు               రాష్ట్రం
————————————————————————————————————–————————————
జెమిని                           18.54               19.23                23.72                 21.06
తేజ టీవీ                            6.95              8.90             9.20                  8.30
ఈ టీవీ                             6.33                 7.35                  9.22                       7.83
మాటీవీ                     7.04              7.17               8.03                 7.52
జీ తెలుగు                       7.41                  7.25                   7.26                      7.32
సితార                              0.01                 0.84                     0.36               0.30
ఏటీవీ                              0.25                 0.22                     0.24                   0.24
వనిత                               0.14                 0.08                      0.14                 0.13
విస్సా                              0.01                 0.03                     0.05                 0.03
ఆర్ టీవీ                         0.04                0.00                      0.00                 0.02
జెమిని మ్యూజిక్              1.83                0.34                        1.54                1.47
మా మ్యూజిక్                 0.92                 0.28                       0.92               0.82
ఎస్వీ భక్తి చానల్              0.38                 0.11                        0.63             0.46
భక్తి టీవీ                           0.41                  0.12                        0.25             0.29
————————————————————————————————

Source: bhavanarayana.co.tv

న్యూస్ చానల్స్ మార్కెట్ వాటా

గడిచిన వారం ( సెప్టెంబర్ 12 నుండి 18 వరకు ) రేటింగ్స్ లో ముందున్నట్టు చెబుతూ టీవీ5 మిత్రుల నుంచి ఎస్ ఎమ్ ఎస్ లు వచ్చాయి. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో ఎంత నిజముందో అర్థమవుతుంది. ముందే చెప్పినట్టు టామ్ సంస్థ మూడు వేరువేరు విభాగాలలో సర్వే జరుపుతుంది. హైదరాబాద్ నగరం ఒక వంతు, పది లక్షలకు పైబడిన జనాభా ఉన్న విశాఖ, విజయవాడ నగరాలు మరోవంతు, లక్ష నుంచి పదిలక్షల మధ్య జనాభా ఉన్న చిన్నపట్టణాలు మూడో విభాగం. ఈ దిగువన ఉన్న పట్టిక చూస్తే టీవీ5 నుంచి అలాంటి మెసేజ్ ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. విశాఖ, విజయవాడ నగరాలలో మాత్రం అది టీవీ9 కంటే ఎక్కువ మార్కెట్ వాటా సంపాదించుకోగలిగింది. అందుకే ఆ ఒక్క పాయింట్ ను ప్రధానంగా చూపుతూ ఆ అంకెలనే ప్రచారం చేసుకుంది.
——————————————————————————————————————————
చానల్                                         హైదరాబాద్          విశాఖ పట్నం       చిన్న               మొత్తం
                                                                              విజయవాడ        పట్టణాలు            రాష్ట్రం                        
——————————————————————————————————————————
టీవీ 9                                               4.58                5.29                      3.26                 4.08
టీవీ 5                                               2.37                5.48                      0.88                  2.15 
ఎన్ టీ వీ                                          1.57                 1.50                      0.94                 1.26      
ఈటీవీ2                                            1.43                   0.96                     1.07                  1.19
హెచ్ ఎమ్ టీవీ                                 0.85                  0.43                      1.68                  1.17
జీ 24 గంటలు                                  1.13                  1.10                        0.88                 1.01
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి                         1.21                  0.94                        0.87                 1.01
సాక్షి                                                 0.93                 1.16                        0.92                 0.96
రాజ్ న్యూస్                                     1.67                    —                         0.21                  0.74
ఐ న్యూస్                                          0.61                 0.95                      0.49                   0.61
మహా టీవీ                                        0.45                0.43                       0.70                   0.57
స్టూడియో ఎన్                                 0.66                 0.40                      0.49                   0.54
జెమినీన్యూస్                                  0.05                0.34                      0.23                    0.18
టీవీ 1                                                0.26                0.33                       0.06                   0.18
హెచ్ వై టీవీ                                       0.00                0.00                      0.00                  0.00
——————————————————————————————————————————

Source: bhavanarayana.co.tv

Monday, September 20, 2010

చానల్ పెట్టాలనుకుంటున్నారా ?

ఒక చానల్ పెడితే ఎలా ఉంటుంది ? చాలా మందికి చాలా సందర్భాల్లో ఇలాంటి ఆలోచన వచ్చే ఉంటుంది. చానల్ పెట్టాలంటే ఎంతవుతుందేంటి ? అని అడిగేవాళ్లకు కొదవే లేదు. చానల్ ఆలోచన మంచిదే కావచ్చుగాని ఏదో ఒక చానల్ అనుకోవటం మాత్రం పొరపాటు. ముందుగా ఎలాంటి చానల్ అనే విషయంలో స్పష్టత అవసరం. ఎంటర్‍టైన్‍మెంట్ చానల్ పెట్టాలనుకుంటున్నారా, 24 గంటలన్యూస్  చానల్ గురించి ఆలోచిస్తున్నారా, ఎంటర్‍టైన్‍మెంట్ చానల్ లోనే న్యూస్ బులిటెన్స్ ఉండాలనుకుంటూన్నారా, ఇవేవీ కాకుండా బిజినెస్, మ్యూజిక్, ఆధ్యాత్మికం, కామెడీ,  పిల్లలు, విద్య, ఆరోగ్యం, పర్యాటకం లాంటి ఏ ఒక్క అంశం గాని కొన్నిటిని కలిపి గాని చానల్ తీసుకురావాలనుకుంటున్నారా ? ఒక స్పష్టమైన అవగాహన లేకుండా చానల్ కోసమే చానల్ అనే ఆలోచన మాత్రం మంచిది కాదు. డబ్బున్న వాళ్ళు చాలా మంది వాళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా చానల్ లో ఒక వార్త వచ్చిందంటే చాలు.. సొంతగా చానల్ పెట్టెయ్యాలని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళు కొంత హడావిడి చేసి ఆ వేడి చల్లారగానే మళ్ళీ చానల్ ఊసెత్తరు. నిజంగానే చానల్ పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంటే మాత్రం అధ్యయనం చెయ్యాలి.
ముందుగా టీవీ పరిశ్రమ గురించి స్థూలంగానైనా తెలుసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆలోచిస్తున్న తరహా చానల్ కి అవకాశం ఉందా ? దీన్నే Need Gap Analysis అంటారు. ఎంటర్‍టైన్‍మెంట్ చానల్ పెట్టాలనుకుంటే ఇప్పుడున్న చానల్స్ ఆర్థిక పరిస్థితి ఏమిటి, అవి ఎందుకు విజయం సాధించాయి, లేదా, ఎందుకు విఫలమయ్యాయి ? దేని మార్కెట్ వాటా ఎంత ? వాటి ప్రత్యేకతలేమిటి ? వాటికంటే భిన్నంగా ప్రేక్షకులకు ఎలాంటి చానల్ ఇచ్చి ఆకట్టుకోగలం ? ఎంత ఖర్చవుతుంది ? పెట్టుబడి ఎంత? నెలవారీ ఖర్చెంత ? ఆదాయమార్గాలేమిటి ? లాభనష్టాలులేని స్థితి ఎన్నాళ్ళకు వస్తుంది ? ఇలాంటి విషయాలన్నీ పరిశీలించాలి. సినిమా హక్కులు కొనకుండా ఎంటర్‍టైన్‍మెంట్ చానల్ కష్టం. ఎన్ని సినిమాలు మార్కెట్లో ఉన్నాయి ? వాటికోసం పోటీపడితే ఎంత ఖర్చవుతుంది ? ఇలాంటివన్నీ ముందుగానే తెలుసుకోవాలి. న్యూస్ బులిటెన్స్ కూడా ఉండాలంటే ముందుగానే న్యూస్ చానల్ లైసెన్స్ తీసుకోవాలి. న్యూస్ చానల్ పెట్టాలనుకున్నా మార్కెట్ సర్వే తప్పనిసరి. ఇప్పుడున్న చానల్స్ ఎన్ని ? వాటికంటే భిన్నంగా ఎలా తీసుకురాగలం ? ప్రేక్షకుడు ఈ చానల్ నే చూడాలని ఎందుకు అనుకుంటాడో స్పష్టమైన అవగాహన ఉండాలి. కాస్త భిన్నంగా ఉంటేనే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చుననో, ఫలానా చానల్ అయితే ఎక్కువ ప్రకటనలు వస్తాయనో, పొరుగు రాష్ట్రంలో అది క్లిక్ అయిందనో ఆలోచించినా పరవాలేదు. లాభాలకంటే నష్టాలగురించి బాగా ఆలోచించి గట్టిగా నిలబడగలమనే నమ్మకం కుదిరితే చానల్ యజమాని కావడానికి సిద్ధమైపోవచ్చు.
చానల్ పెట్టాలని నిర్ణయించుకున్న తరువాత కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించాలి. పెట్టాలనుకునే చానల్ ను బట్టి ఆ కంపెనీ నికర ఆస్తుల విలువ ఉండాలి. ఇప్పటివరకు ఉన్న నియమాల ప్రకారమైతే, న్యూస్ చానల్ కు 3 కోట్లు, నాన్-న్యూస్ చానల్ అయితే 1.5 కోట్లు ఉండాలి. ఎంటర్‍టైన్‍మెంట్ చానల్ అయితే విదేశీ పెట్టుబడుల విషయంలో ప్రత్యేకమైన నియమాలేవీ లేవుగాని న్యూస్ చానల్ అయితే 26 శాతానికి మించి ఉండకూడదు. కంపెనీ రిజిస్ట్రేషన్ తో బాటుగా బ్రాండ్ పేరు.. అంటే చానల్ పేరు కూడా ఖరారు చేసి రిజిస్టర్ చేయించాలి. న్యూస్ చానల్ అయితే విదేశీ డైరెక్టర్ల ఎంపికలోనూ, కీలకమైన ఉద్యోగుల విషయంలోను కొన్ని నిబంధనలున్నాయి. డైరెక్టర్లకు ఎలాంటి నేరచరిత్రా ఉండకూడదు. ఫెరా (విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం) నిబంధనల ఉల్లంఘన లాంటి ఆర్థికసంబంధమైన అవకతవకలకు పాల్పడి ఉండకూడదు.  ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని నమోదు చేయించాలి. సాధారణంగా ఆడిటర్లు ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటారు.
రిజిస్ట్రేషన్ దగ్గర నుండీ చానల్ ఏర్పాట్లు చురుగ్గా మొదలవుతాయి. శాటిలైట్  ట్రాన్స్ పాండర్ లో బాండ్‍విడ్త్ బుకింగ్ ఇందులో మొదటి దశ. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో ) వారి మార్కెటింగ్ విభాగం బాండ్‍విడ్త్ లీజు ఒప్పందాలు చేసుకుంటుంది. మూడునెలల అద్దె అడ్వాన్సుగా తీసుకుని బాండ్‍విడ్త్ ఒప్పంద పత్రం మీద సంతకాలు చేస్తుంది. వాస్తవంగా బాండ్‍విడ్త్ ఉపయోగించుకున్నప్పటినుండే లీజు మొత్తాన్ని వసూలు చేస్తారు. అందుకే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఎప్పుడు చానల్ మొదలుపెట్టబోతున్నారో కనీసం ఒక నెల ముందుగా ఇస్రో అధికారులకు తెలియజేస్తే తగిన ఏర్పాట్లు చేస్తారు. ఒప్పందం కుదుర్చుకున్నాం కదా అని అన్ని ఏర్పాట్లూ చేసుకుని చానల్ మొదలెడదామనుకుంటే ఇస్రో చేతులెత్తేయవచ్చు. బాండ్‍విడ్త్ ఇప్పటికిప్పుడు లేదని చెప్పవచ్చు. ఒప్పందంలో ” అందుబాటులో ఉంటే ” ( subject to availability ) అని ఒక వాక్యం ఉండనే ఉంటుంది. 20-25 పేజీలుండే ఆ ఒప్పందంలో ఈ చిన్న పాయింట్ చూసీ చూడకుండా వదిలేస్తే ఆ తరువాత ఇబ్బందులు రావచ్చు. అందుకే, చానల్ ప్రారంభించబోయే ముందే ఆ తేదీని ఇస్రో కు తెలియజేసి అప్పటికి బాండ్‍విడ్త్ సిద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
బాండ్‍విడ్త్ ఒప్పందం తరువాత చానల్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో బాటు ఈ ఒప్పందం ప్రతిని జతచేయాలి. అదేవిధంగా కంపెనీ రిజిస్ట్రేషన్ పత్రాలు, డైరెక్టర్ల వివరాలు, వారి వాటాల వివరాలు పొందుపరచాలి. ఒరిజినల్ దరఖాస్తుతో బాటు మరో నాలుగు ప్రతులు సమర్పించాల్సి ఉంటుంది. వివిధ విభాగాల అనుమతుల అనంతరమే లైసెన్స్ ఇస్తారుగనుక ఆయా విభాగాలకు పంపడం కోసమే ఇలా మొత్తం ఐదు ప్రతులు అందజేయాలి. అది న్యూస్ చానలా, నాన్ న్యూస్ చానలా అనేది దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి. దరఖాస్తుతోబాటు ప్రాజెక్ట్ రిపోర్ట్ జతచేయాలి. పెట్టబోయే చానల్ మీద ఏ మేరకు అధ్యయనం జరిగిందో, లాభాలు సంపాదించేందుకు ఏ మేరకు అవకాశం ఉందో ప్రాజెక్ట్ రిపోర్ట్ లో వివరించాలి. పెట్టుబడి వనరులు, ఆదాయ అవకాశాలు, లాభాల్లోకి వచ్చేవరకు తట్టుకోగలిగే శక్తి, బాంకులు తదితర ఆర్థిక సంస్థల నుండి రుణాలు పొందేందుకు కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజుగా పదివేల రూపాయలు చెల్లించి సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలి. ఈ వ్యవహారాలన్నీ చూసుకోవటానికి కొంతమంది కన్సల్టెంట్లు కూడా ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళను తాము ప్రోత్సహించటంలేదని సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ తేల్చిచెప్పింది. దరఖాస్తునింపడం మొదలుకొని చాలా విషయాలు తెలియకపోవటం వల్లనే చాలామంది కన్సల్టెంట్లను ఆశ్రయిస్తుంటారు. ప్రతినెల మొదటివారంలో దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించటానికి ఈ మధ్యనే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. దరఖాస్తు ఏ స్థాయిలో ఉంది, ఏవైనా లోపాలున్నాయా, ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది లాంటి విషయాలన్నిటికీ ఆ సమావేశంలో సమాధానాలు దొరుకుతాయి. ఒక దరఖాస్తు పూర్తి స్థాయిలో ఆమోదం పొంది లైసెన్స్ రావటానికి మూడు నుంచి ఆరు నెలలు పడుతుంది.
ఒక వైపు దరఖాస్తు ప్రాసెసింగ్ జరుగుతుండగానే మరో వైపు చానల్ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన పనులు చురుగ్గా సాగాలి. కీలక సిబ్బంది నియామకం జరగాలి. న్యూస్ చానల్ అయితే న్యూస్ లో కనీసం పదేళ్ళ మీడియా అనుభవం ఉన్న వారు ఆ విభాగ నిర్వహణ బాధ్యతలు చూస్తారని దరఖాస్తులోనే చెప్పి ఉండటం వలన అటువంటి వాళ్ళను నియమించుకోవాలి. మిగిలిన వనరుల సమీకరణ కూడా చురుగ్గా సాగాల్సిన సమయమిది. వివిధ విభాగాల అధిపతులను నియమించటం పూర్తయ్యాక జూనియర్ ( ట్రెయినీ ) ఉద్యోగుల ఎంపిక , శిక్షణ మొదలవుతాయి. కార్యాలయానికి అన్ని హంగులు సమకూర్చుకోవటం కూడా ఈ దశలోనే సాగుతుంది. టెక్నికల్, మార్కెటింగ్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ తదితర విభాగాల అధిపతులు సమన్వయంతో పురోగతిని సమీక్షించుకుంటూ ముందుకు సాగుతారు. ప్రొడక్షన్ సొంత వనరులతో చేపట్టాలా, ఔట్‍సోర్సింగ్ చెయ్యాలా, రెండు పద్ధతులూ తగిన నిష్పత్తిలో పాటించాలా అనేది నిర్ణయించి అమలు ప్రారంభించాలి. ఎంటర్‍టైన్‌మెంట్ చానల్ అయితే సినిమాల ప్రసార హక్కుల కొనుగోలు లాంటి అంశాలమీద దృష్టి సారించాలి.
ఆ తరువాత ప్రధానమైన అంశం సామగ్రి కొనుగోలు. విదేశాలనుంచి దిగుమతిచేసుకోవలసిన అవసరం ఉండటం వలన ఇందుకు తగినంత సమయం అవసరం. కన్సల్టెంట్లను నియమించుకునే పక్షంలో ఆయా పరికరాల అమ్మకందారులను వారే తీసుకువస్తారు. ముందుగా చానల్ కు తగిన పరికరాలు ఎంచుకోవాలి. అప్పటికే ఇతర చానల్స్ ఏయే సామగ్రి వినియోగిస్తున్నాయి, ఆ సామగ్రి ఎంత బాగా పనిచేస్తోంది అనే అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. అమ్మకాల తరువాత ఆయా సంస్థలు అందించే సేవలు ఎలా ఉంటాయి, ధరలు అనే విషయాలు ప్రధానంగా పరిశీలిస్తారు. సామగ్రి ఎంపిక జరిగిన తరువాత ఆ సామగ్రి ని ఆర్డర్ చెయ్యాలి. సాధారణంగా  బాంక్ గ్యారంటీ/ఎల్ సీ లాంటి తతంగాలు పూర్తయ్యాక ఆరు వారాల్లో సామగ్రి చేరుతుంది. వాటిని తగిన విధంగా అమర్చుకోవటానికి కనీసం పదిరోజుల సమయం పడుతుంది. ఈ లోపు స్టుడియో, దాని అనుబంధ విభాగాల నిర్మాణం, లైటింగ్, ఎయిర్ కండిషనింగ్, ఇంటీరియర్స్ లాంటి ఏర్పాట్లు పూర్తవుతాయి.
ఈ లోపు పంపిణీ , మార్కెటింగ్ వ్యూహాలు రూపొందించుకుంటారు. చానల్ ను గాలిలోకి పంపటం ఒక ఎత్తు, దాన్ని అందుకొని ప్రేక్షకులకు అందించటం ఒక ఎత్తు. అందుకే కేబుల్ ఆపరేటర్ చాలా కీలకమైన వ్యక్తి అయ్యాడు. ప్రతి ఆపరేటర్ ఈ చానల్ సిగ్నల్స్ అందుకొని ప్రేక్షకులకు చూపించగలిగితే దాని సామర్థ్యాన్ని బట్టి అది నిలదొక్కుకోగలుగుతుంది. అందువలన ముందుగా చానల్ అందరికీ అందుబాటులోకి రావాలి. కనుక పంపిణీ అనేది చానల్ కు అత్యంత కీలకమైనది. చాలా సందర్భాలలో ముఖ్యమైన ఆపరేటర్లకు కారేజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చానల్ బడ్జెట్ లో కూడా ఇందుకోసం ప్రత్యేకమైన ఏర్పాటు ఉండాలి. రెండో ప్రధానమైన అంశం మార్కెటింగ్. సొంత వ్యవస్థ ఏర్పాటు చేసుకోవటమా, ఔట్‍సోర్సింగ్ మంచిదా అనేది నిర్ణయించుకోవాలి. స్లాట్స్ అమ్మటం, కార్యక్రమాల తయారీ మాత్రమే బయటివాళ్ళకిచ్చి సొంతగా మార్కెట్ చేసుకోవటం, సొంతగా కార్యక్రమాలు రూపొందించి స్పాన్సర్లను రాబట్టటం లాంటి పద్ధతులమీద చర్చించి, లాభదాయకమైన మార్గాన్ని నిర్ణయించుకుంటారు. ఈ సమయానికి చానల్ లైసెన్స్ వచ్చి, టెక్నికల్ గా కూడా సిద్ధంగా ఉంటుంది గనుక అంతా సజావుగా ఉందో, లేదో సరిచూసుకునేందుకు ట్రయల్ రన్ మొదలవుతుంది.   సాంకేతికమైన అంశాలతో బాటు కార్యక్రమాల సన్నద్ధత కూడా సరిచూసుకునేందుకు ఈ సమయం ఉపయోగపడుతుంది. కనీసం 15 రోజులపాటు టెస్ట్ సిగ్నల్ పేరుతో ట్రయల్ రన్ నడిచిన తరువాతనే చానల్ లాంచ్ చేయడం సర్వ సాధారణం.

Source: bhavanarayana.co.tv

Monday, September 13, 2010

రేటింగ్స్ : 29 ఆగస్టు – 4 సెప్టెంబర్

మూడో స్థానంలోకి సాక్షి
ఆగస్టు 29- సెప్టెంబర్ 4 వారంలో సాక్షి న్యూస్ చానల్ మార్కెట్ వాటా గణనీయంగా పెరిగింది. జగన్ ఓదార్పు యాత్ర జరిగిన ప్రతి సారీ ఆ చానల్ రేటింగ్ పెరగటం ఇంతకుముందు కూడా గమనించాం. ఈ సారి వై ఎస్ మొదటి వర్ధంతి సందర్భంగా వివిధ చానల్స్ లో ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమాలకు కూడా ఆదరణ బాగా ఉన్నట్టు రేటింగ్స్ ను బట్టి అర్థమవుతోంది. అయితే ఈ సారి ప్రత్యేకంగా సాక్షిలో వై ఎస్ వర్ధంతి తో బాటు జగన్ యాత్ర కూడా కలసిరావడంతో రేటింగ్ సహజంగానే పెరిగింది.
పుంజుకున్న టీవీ5, ఐ న్యూస్
మూడు వారాలుగా తగ్గుతున్న టీవీ5 ఈ సారి కాస్త పుంజుకుంది. అయినప్పటికీ మొదటి స్థానంలో ఉన్న టీవీ 9 లో సగానికే పరిమితం కాక తప్పటం లేదు. టీవీ9 గత మూడు వారాలలో తగ్గుదల నమోదు చేసుకుంటున్నప్పటికీ ఇదే పరిస్థితి. దాాపుగా అన్ని చానల్స్ కొద్దో గొప్పో తగ్గుతున్నా టీవీ5, రాజ్ న్యూస్, ఐ న్యూస్ కొద్దిపాటి పెరుగుదలనే నమోదుచేసుకున్నాయి. వరుసగా రేటింగ్స్ పునరుద్ధరించుకోవటం ద్వారా ఐ న్యూస్ బాగానే కోలుకుంటోంది.
 పంపిణీ మీద దృష్టి పెట్టిన జెమినీ న్యూస్
ఎంటర్టైటన్మెంాట్ చానల్స్ లో నెంబర్ వన్ జెమిని టీవీ. న్యూస్ లో ఆఖరిస్థానం జెమిని న్యూస్. పే చానల్ గా జనం నుంచి ముక్కు పిండి వసూలు చేస్తుండటంతో కేబుల్ ఆపరేటర్లు చచ్చినట్టు దీనికి కూడా డబ్బు చెల్లిస్తూ చానల్ ను ఎక్కడొ దూరంగా విసిరేస్తూ వచ్చారు. ఇప్పుడు జెమినీ యాజమాన్యం న్యూస్ చానల్ ను కూడా కాస్త ప్రముఖంగా చూపించాలని ఆపరేటర్లను పదే పదే కోరుతోంది. దాని ఫలితం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. రేటింగ్స్ చార్టులో స్థానం ఇంకా మారకపోయినా కాస్త మెరుగుదల ఇప్పుడిప్పుడే మొదలైంది.
ఆగిన ఆర్టీవీ కి రేటింగ్స్ ఏలనో ?
 ఆ మధ్య అకస్మాత్తుగా శాటిలైట్ సమస్యతో దాదాపు నలభై చానల్స్ ఆగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలోనే జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభం కావటం, ఆగిన చానల్స్ లో సాక్షి కూడా ఉండటంతో నిజం తెలియని కొంతమంది దీని వెనుక కుట్రకోణం గురించి కూడా ఆలోచించారు. అది ప్రమాదవశాత్తూ జరిగిందేనని తరువాత తేలిందనుకోండి. ఆ సమయంలో సాక్షి టీవీ వెంటనే వనితలో ప్రసారమయ్యేలా అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకున్నారనుకోండి. ఆ తరువాత కొద్దిరోజులకే ఇస్రో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అయితే, ఆర్టీవీ మాత్రం ప్రత్యామ్నాయానికి ఒప్పుకోలేదు. అలా ప్రసారాలు ఆపేసింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే, ఆపేసిన ఆర్టీవీ కి సైతం ఎంతో కొంత రేటింగ్ ఇవ్వాలని టామ్ భావించినట్లుంది. నాలుగు వారాలుగా ఇదే ధోరణి. కచ్చితత్వానిని తిరుగులేదని చెప్పుకునే టామ్ మరి గాల్లో లేని చానల్ కూ రేటింగ్ ఎలా ఇవ్వగలుగుతోందో ? టామ్ డొల్ల తనానికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటుంటుందా ?

Source: bhavanarayana.co.tv

తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో న్యూస్ చానల్

చానల్ 4 టెస్ట్ సిగ్నల్స్ మొదలయ్యాయి. సాంకేతికంగా దీన్ని హెచ్ వై టీవీ అనే పిలవాల్సినా అది కేవలం సాంకేతికమే కాబట్టి జవజీవాలు సమకూర్చిన చానల్4 యాజమాన్యాన్నే గుర్తించాలి. టీ ఆర్ ఎస్ వారి రాజ్ న్యూస్ తరువాత రాష్ట్రంలో ఇలా లీజు పద్ధతిమీద నడుస్తున్న రెండో చానల్ ఇది. ఒకవైపు ఇన్ని న్యూస్ చానల్స్ ఎలా మనగలుగుతాయని అందరూ అనుకుంటున్న సమయంలోనే ధైర్యంగా ముందుకొచ్చిన చానల్ ఇది. నగరవాసులనుద్దేశించిన చానల్ అయినా ఇది కేవలం మెట్రో చానల్ గానే స్థిరపడిపోవటానికి సిద్ధంగాలేదు. పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని ముందుకొచ్చిన ఈ చానల్ ఇంకా కేబుల్ ఆపరేటర్ల ద్వారా పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు అందాల్సి ఉంది. తొలుత హైదరాబాద్ ను లక్ష్యంగా చేసుకొని, ఆ తరువాత ప్రధాన నగరాలు, పట్టణాలకు విస్తరించే వ్యూహంతో చానల్4 ముందుకు సాగుతోంది. ఈ లోపు చిన్న చిన్న లోటుపాట్లను సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆ సంస్థ నిర్వాహకులు వాసిరెడ్డి శివరామ్ ప్రసాద్.
అడ్వర్టయిజింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన శివరామ్ ఫ్రసాద్ ఈనాడుతో జీవితం ప్రారంభించారు. ప్రజలను ఆకట్టుకునేవిధంగా ఎలాంటి మాధ్యమాన్ని ఎలా తీర్చిదిద్దాలనే విషయంలో ఆయనకు నిశ్చితాభిప్రాయాలున్నాయి. పరిసరాలు గమనిస్తూ, సృజనాత్మకంగా ఆలోచిస్తూ, ఆలోచనలకు పదునుపెడుతూ అనుక్షణం కొత్తదనం కోసం తపిస్తూ ఉంటారు. అందుకే కేవలం ’ ఉద్యోగం ’ ఆయనకు సంతృప్తినివ్వలేకపోయింది. అంతమాత్రాన ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవటం మంచిదికాదన్న మిత్రుల సలహాలు కూదా బాగానే పనిచేశాయి. ఉద్యోగం చేస్తూనే ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్నాక ఇక వెనుదిరిగి చూడలేదు. నైట్ డ్యూటీ వేయించుకొని పగలంతా తన సొంత ఏజెన్సీ పనులతో బిజీ అయ్యారు. ఆ రంగంలో నిలబడగలననే పూర్తి నమ్మకం కలిగాక ఉద్యోగానికి రాజీనామా చేశారు. విజన్ కమ్యూనికేషన్స్ బాగానే పుంజుకుంది. ఆ తరువాత అక్రెడిటేషన్ సమయంలో పేరుమార్పు అనివార్యం కావడంతో అది విన్నింగ్ ఎడ్జ్ కమ్యూనికేషన్స్ గా మారింది. ఏజెన్సీ కార్యకలాపాలలో భాగంగా అనేక టీవీ ప్రకటనలు తయారుచేయటం, కార్యక్రమాలు మార్కెట్ చేయటం అలవాటయ్యాయి. అప్పుడే ఆయనకు టీవీ చానల్ ఆలోచన వచ్చింది.
విన్నింగ్ ఎడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సత్య టీవీ కి పునాదులు వేశారు. ఆశించిన పెట్టుబడులు సకాలంలో అందకపోవటంతో తొలి తెలుగు చానల్ స్థాపించిన ఘనత ఆయనకు దక్కలేదు. నష్టం కోట్లలో ఉన్నా, తప్పనిసరిపరిస్థితుల్లో కారుచౌకగా అమ్మేసి బయటపడ్డారు. (ఆ డబ్బు సైతం ఆయనకు పూర్తిగా ముట్టలేదని ఆయన సన్నిహితులు చెబుతారు). మళ్ళీ ఆయన తన యాడ్ ఏజెన్సీ పనుల్లోకి వచ్చారు. ఫోర్త్ ఎస్టేట్ నెట్‍వర్క్ ( ప్రై ) లిమిటెడ్ పేరుతో కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ సారి బ్రాండ్ నేమ్ చానల్ 4. సత్య చానల్ చేదు అనుభవం మిగిల్చినా చానల్ నడపాలన్న ఆలోచన మాత్రం ఆయన మదిలో మెదులుతూనే ఉంది. శ్రేయ బ్రాడ్‍కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కోరిక మేరకు ఆయనతో చేతులు కలిపి టీవీ5 ప్రారంభించారు. చానల్ బ్రాండింగ్ మొదలుకొని ప్రతివిషయంలోనూ ఆయన తీసుకున్న శ్రద్ధ తోనే చానల్ బలమైన పునాదులు వేసుకొని ఇప్పటికీ నెంబర్ టూ స్థానంలో నిలబడింది. నిలదొక్కుకునే స్థాయి వచ్చిన తరువాత అక్కడ ఆయన అవసరం లేకపోయింది. ఆ పరిస్థితుల్లో బయటపడాల్సివచ్చింది.
అదే సమయంలో ఇద్దరినుంచి ఆయనకు పిలుపు వచ్చింది. ఒక చానల్ యజమాని ఆహ్వానిస్తే మర్యాదగానే తిరస్కరించారు. ఆయన తనను పిలవడం వెనుక హుందాతనం, సదుద్దేశం లేవనేది శివరామ్ ప్రసాద్ అభిప్రాయం. అందుకే సున్నితంగా త్రోసిపుచ్చారు. మరో చానల్ ఎం డీ అడిగితే అక్కడి చాదస్తపు పద్ధతులు, శీర్షికలు నచ్చక వెళ్ళలేదు. అంతలో నార్నె నెట్‍వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి నార్నె శ్రీనివాసరావు ఆయనను సంప్రదించారు. స్టుడియో ఎన్ పేరుతో చానల్ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. కొంతకాలం ఇంగ్లిష్ చానల్ అనుకుని ఆ తరువాత అకస్మాత్తుగా నిర్ణయం మార్చుకుని ఎన్నికలకు ముందే హడావిడిగా తెలుగు చానల్ తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించింది. అయినా సరే తక్కువ ఖర్చులో తక్కువ సమయంలో చానల్ బాగా తీసుకురాగలిగారు. ఎన్నికల సమయంలో ఒక పార్టీకి కొమ్ముకాయాల్సి రావటం, చానల్ గా నిలదొక్కుకోకముందే ఒక ముద్ర పడటం లాంటి అంశాలు ఇబ్బందులకు దారితీస్తున్నా చానల్ లో సృజనాత్మకత కనిపించడాన్ని అందరూ మెచ్చుకున్నారు. కానీ అదే సమయంలో యాజమాన్య నిర్ణయాలు, ఎడిటోరియల్ వ్యవహారాల్లో అడ్మినిస్ట్రేషన్ మితిమీరిన జోక్యం లాంటివి ఆయనకు ప్రతిబంధకాలయ్యాయి. చేరే ముందు ఇచ్చిన హామీలేవీ పనిచేయలేదు. అలా స్టుడియో ఎన్ లో శివరామ్ ప్రసాద్ అధ్యాయం ముగిసింది.
ఇన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఆయన కృంగిపోలేదు. అది ఆయన నైజం కూడా కాదు. సత్య టీవీలో కోట్లు నష్టపోయినా ఆయన బాధ పడలేదు గాని టీవీ5 లాంచింగ్ ఆలస్యమవుతున్నప్పుడు మాత్రం ఆ ఒత్తిడి వల్లనే ఆస్పత్రిపాలయ్యారని ఆయనకు అత్యంత సన్నిహితులొకరు చెప్పేవారు. ఆయన అంకితభావానికి అదొక నిదర్శనం.  మళ్ళీ చానల్ ఆలోచన ఏమైనా ఉందా అంటే, ” అంత డబ్బు నా దగ్గర సమకూరిన రోజున, లేదా సరైన ఇన్వెస్టర్లు దొరికిన రోజున తప్పకుండా ఆలోచిస్తా”ననేవారు.  అలాగే ఇప్పుడాయనకు ” సరైన ఇన్వెస్టర్లు”  దొరికినట్టున్నారు. లీజుకు తీసుకోవటం ద్వారా తక్కువ పెట్టుబడితో సాధ్యమయ్యే ఈ చానల్ ని ఎంచుకున్నారు. క్రమంగా విస్తరించే అవకాశం ఉన్న ఈ మోడల్ తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఒక న్యూస్ చానల్ నిర్వహణకయ్యే నెలవారీ ఖర్చులో మూడోవంతు ఖర్చుతోనే ఈ చానల్ నడపడానికి ఆయన ఏర్పాట్లు చేసుకున్నట్టు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. ఆయన అనుభవం ఒకవైపు, ఆయనతో కలిసి పనిచేయటానికి ఇష్టపడేవారు జీతం గురించి పెద్దగా ఆలోచించకపోవటం మరోవైపు దీన్ని సాధ్యం చేసి ఉండాలి.
మొత్తం మీద చానల్ 4 ఇప్పుడు మనముందుంది. ఇప్పటికిప్పుడు చానల్ ప్రసారాలను విశ్లేషించటం వీలయ్యేపనికాదు. చానల్ ఇంకా టెస్ట్ సిగ్నల్ దశలోనే ఉంది. పైగా మొదట్లో ఉండే ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. అతి తక్కువ కాలంలో అతి తక్కువ ఖర్చుతో వచ్చిన చానల్ కనుక అందరిలోనూ ఆసక్తి మాత్రం ఉంటుంది. మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేల ఇంటర్వ్యూలు మొదలుకొని అడుగడుగునా కొత్తదనం కనిపించేలా కొత్త కార్యక్రమాలతో సిద్ధమైనట్లు   అర్థమవుతూనే ఉంది.  Face the Truth అని సవాలు చేస్తున్న చానల్4 ఇంకా  తన డౌన్ లింకింగ్ వివరాలను బహిరంగంగా ప్రకటించలేదు. ఆసక్తి ఉన్న జర్నలిస్టులు మాత్రం channel4.in లో చూడటం లో బిజీ అయ్యారు. చూడగానే కూల్ గా కనిపిస్తూ, అనవసరమైన హడావిడికి దూరంగా, ఒక స్క్రోల్ లైన్ కే పరిమితమై ఆకట్టుకుంటూంది.  ఇన్ని న్యూస్ చానల్స్ ఉన్నా ” నేను సైతం ” అని ఎలుగెత్తి చాటుకుంటూ , “We have a Dream” అంటున్న చానల్4 ఆ కలను సాకారం చేసుకుంటుందని ఆశిద్దాం.

Source: bhavanarayana.co.tv

Thursday, September 2, 2010

దూరదర్శన్ జబ్బుకు డిజిటల్ వైద్యం ?!!!!

దూరదర్శన్ ఎందుకు వెనుకబడిందో అధికారులకు తెలియక కాదు.. దాన్ని ముందుకునడిపించాలనే చిత్తశుద్ధిలేకనే అది వెనుకబడింది. ఒకరో, ఇద్దరో అధికారులు నిజంగా ప్రయత్నించినా అడ్డుకునే రాజకీయనాయకులు ఎలాగూ ఉండనే ఉన్నారు. కర్ణుడి చావుకు కారణాలలాగానే దూరదర్శన్ దుస్థితికీ చాలా కారణాలున్నాయి. ( Doordarshan Days పేరుతో భాస్కర్ ఘోష్ రాసిన పుస్తకంలో చాలా విషయాలున్నాయి. ఇప్పుడు మార్కెట్లో లేదు కాబట్టి చదవాలనుకున్నా కుదరదు. అందుకే మరో సందర్భంలో ఆ పుస్తకాన్ని సమీక్షిద్దాం.) ఇప్పుడు అకస్మాత్తుగా దూరదర్శన్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ప్రసారభారతి కోసం 1540 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డబ్బుతో డిజిటలైజేషన్ చేపట్టి ప్రసార నాణ్యత పెంచుతారట. ప్రసారాల నాణ్యతకూ, ప్రసారనాణ్యతకూ తేడా గుర్తించకపోవటం వలన మరో సారి జరుగుతున్న భారీ దుబారా ఇది. ఇటీవలే యాభై ఏళ్లు పూర్తిచేసుకున్న దూరదర్శన్ ఈ సందర్భంగా తగిన విధంగా ఆత్మ విమర్శ కూడా చేసుకోలేదనటానికి ఇదొక నిదర్శనం. ఇప్పటికే పరికరాలు, మౌలికవసతులమీద వేలకోట్లు ఖర్చుపెట్టి, కార్యక్రమాల నాణ్యతను గాలికొదిలేసిన దూరదర్శన్ అదే తప్పు కొనసాగించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నా, ప్రసారభారతి పరిధిలోకి చేర్చినా మౌలికంగా దూరదర్శన్ లో రావలసిన మార్పులు రాలేదని గత యాభై ఏళ్ల చరిత్ర మనకు చాటి చెబుతూనే ఉంది.
దూరదర్శన్ మనదేశంలోకి అనుకోని అతిథిగానే వచ్చింది. ఫిలిప్స్ కంపెనీ ఒక ఎగ్జిబిషన్ ముగించుకుని వెళ్ళేముందు 21 టీవీసెట్లు బహుమతిగా వదిలి వెళితే, ఆకాశవాణి ఆధ్వర్యంలో బొమ్మలు జోడించి పరిచయమైంది టీవీ. వారానికి రెండు సార్లు గంట చొప్పున జరిగిన ప్రసారాలనే గుంపులు గుంపులుగా సంభ్రమాశ్చర్యాలతో చూసిన క్షణాలవి. ట్రాఫిక్ మర్యాద, ఆహార పదార్థాల్లో కల్తీ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ వంటి విషయాలు చర్చిస్తూ సాగిన డీడీ నడక మీద ఆసక్తి తప్ప అసహనం కలగని రోజులవి.
నెహ్రూ హయాంలో టీవీని పెద్దగా పట్టించుకోలేదు. ఆయన చనిపోయేనాటికి ( టీవీ వచ్చిన ఐదేళ్ళకు ) దేశంలో టీవీ సెట్లు 58 మాత్రమే. ఆ తరువాత మరో ఐదేళ్లకు గాని దేశంలో తొలి టీవీ ఫాక్టరీ ఏర్పాటై ఏడాదికి 1250 సెట్లు తయారుచేయడం మొదలుపెట్టలేదు. ఇందిరాగాంధీ వచ్చిన తరువాతే ఈ మార్పులన్నీ. టీవీ శక్తిని గుర్తించడంలోనూ, దుర్వినియోగం చేయడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకోగలిగారామె. ప్రముఖ పాత్రికేయురాలు సెవంతీ నైనన్ ఒక సందర్భంలో ” నెహ్రూ ఒక విజనరీ, ఇందిరాగాంధీ మాత్రం టెలివిజనరీ” అని వ్యాఖ్యానించారు. సమాచార శాఖామంత్రిగా ఉన్నరోజుల్లోనే ఆమే ఏర్పాటుచేసిన చందా కమిటీ ఆమె ప్రధాని అయ్యాక నివేదిక సమర్పించినా, టీవీకి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడమనేది ఇందిరాగాంధీకి నచ్చలేదు. లైసెన్స్ ఫీజు వసూలు తప్ప ఆదాయమార్గంలేని టీవీని వాణిజ్యపరంగా తీర్చిదిద్దటానికి అభ్యంతరం చెప్పలేదుగాని, ప్రభుత్వ కనుసన్నల్లోనే పనిచేయించారు. బీబీసీ తరహాలో స్వతంత్ర సంస్థగా నడపాలన్న సూచనలను ఆమె చివరిదాకా వ్యతిరేకిస్తూనే వచ్చారు.
ఎదురుదాడికీ, ఆత్మరక్షణకూ టీవీ ఎంత అవసరమో గుర్తించిన ఏకైక వ్యక్తి ఇందిరాగాంధీ.  అందుకే ఎమర్జెన్సీలో టీవీని ఎడాపెడా వాడుకున్నారు. టీవీ విస్తృతి పెరిగింది.13 ఏళ్లపాటు ఢిల్లీకే పరిమితమైన ప్రసారాలు ముంబయ్ కి విస్తరింపజే్శారు. వెనువెంటనే మిగిలిన నగరాలూ ఆ జాబితాలో చేరాయి. 1976 లో ఆకాశవాణి నుంచి విడిపోయి దూరదర్శన్ ఏర్పడటం, ఆ తరువాత వాణిజ్యపరంగా ఆదాయ వనరులు వెతుక్కోవడం ఆమె హయాంలోనే జరిగాయి. అయితే ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ఆమె దూరదర్శన్ ను విచ్చలవిడిగా ఉపయోగించుకున్నారు. ఏ అధికార హోదా లేకపోయినా ఆమె పుత్రరత్నం సంజయ్ గాంధీ రోజూ బుల్లితెరమీద ప్రత్యక్షమైన  రోజులవి. గిట్టని వాళ్ళను అణచివేయడానికి దూరదర్శన్ ఇందిరాగాంధీకి ఒక ఆయుధమైంది. 1977 లో ప్రతిపక్షాల భారీ ర్యాలీకి జనం రాకుండా చూసేందుకు ఆ రోజుల్లో బ్లాక్‍బస్టర్ గా పేరుపొందిన బాలీవుడ్ చిత్రం ’బాబీ’ ని ప్రసారం చేయాల్సిందిగా ఢిల్లీ దూరదర్శన్ కేంద్రాన్ని ఘనత ఆమెది. అయినా జనం రావటం, సభ సక్సెస్ కావటం, ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఓడిపోవటం తెలిసిన విషయాలే. ఎమర్జెన్సీ లో సెన్సార్‍షిప్ ఫలితంగా ఇబ్బందులెదుర్కున్న జనతాపార్టీ, ఆ తరువాత అధికారం చేపట్టినప్పుడు సంస్కరణల మార్గంలో వర్ఘీస్ కమిటీని ఏర్పాటుచేసినా ఫలితం కనిపించలేదు. ఆ సిఫార్సు ఆధారంగా ప్రవేశపెట్టిన ఆకాశ్ భారతి బిల్లు పార్లమెంట్‍లో ఆమోదం పొందకముందే జనతాప్రభుత్వం కూలిపోయింది, బిల్లు కాలపరిమితి ముగిసి కనుమరుగైంది. దూరదర్శన్ ప్రసారాలమీద ఇందిరాగాంధీ పట్టు మరింత పెరిగింది.
80లలో సాంకేతికంగానూ, వాణిజ్యపరంగానూ, వినోదాత్మకంగానూ దూరదర్శన్ ఎదుగుదలను తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు.  నేషనల్ నెట్‍వర్క్ ఏర్పడటం, రంగుల ప్రసారాలు, శాటిలైట్ విప్లవం.. అన్నీ వరుసగా టీవీని పరిపుష్టం చేస్తూ వచ్చాయి. అయితే నేషనల్ నెట్‍వర్క్ లో  రాత్రి 8.30 నుంచి 11 వరకూ హిందీ కార్యక్రమాలు ప్రసారం చేయటం పట్ల తమిళనాడు, కర్నాటక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.   బలవంతంగా హిందీని రుద్దుతున్నారంటూ ఆక్షేపించాయి. “రాత్రి 8.30 కల్లా మా రాష్ట్రంలో ప్రజలు టీవీ కట్టేసి విద్యుత్ ఆదా చేసేలా చూస్తున్నందుకు కృతజ్నతలు” అంటూ కర్నాటక ముఖ్యమంత్రి అప్పటి దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ కు వ్యంగ్యంగా లేఖ రాశారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత ప్రాంతీయ ప్రసారాలు పెరగటం, ప్రాంతీయంగా డీడీ చానల్స్ మొదలుకావడం వేరే విషయాలు.  కానీ నేషనల్ నెట్‍వర్క్ ఫలితంగా వాణిజ్య ప్రకటనలు పెరిగాయి.  భారతీయ సంస్కృతిని పరిరక్షించటమనే పేరుతో రామాయణ, మహాభారతాలు సీరియల్స్ గా ప్రసారమయ్యాయి. ఆదివారం ఉదయం జనమంతా టీవీలకు దండలువేసి పూజలు చేసి భక్తితో ఆ సీరియల్స్ చూసిన రోజులవి. ఆ సమయంలో నిర్మానుష్యంగా కనిపించిన వీధులే ాఅ సీరియల్స్ విజయానికి నిదర్శనం. అయితే, హిందుత్వ భావనను ప్రేరేపిస్తూ రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి రామాయణం సీరియల్ కారణమంటూ ఆ తరువాత మేధావులు నిర్థారించారు. ” Politics after Television “  లో అరవింద్ రాజగోపాల్ ఈ అంశాన్ని విస్తృతంగా చర్చించారు.
టీవీ  ప్రవాభాన్ని  గుర్తించి, వాక్ ‍ స్వాతంత్రం టీవీ కార్యక్రమాలకు  వర్తించదంటూ ప్రభుత్వం ఒక అడ్డగోలు వాదనకు తెరలేపింది. 1986 లో ముస్లిం మహిళల బిల్లు పార్లమెంటులో ఉండగా ఇందిరాజైసింగ్ అనే న్యాయవాది తన అభిప్రాయాలను దూరదర్శన్ ఇంటర్వ్యూ లో చెప్పారు. అయితే, ప్రసార సమయంలో కొన్ని వ్యాఖ్యలు తొలగించారు. రాజకీయ కారణాలతోనే ఇలా జరిగిందంటూ ఆమె కోర్టుకెళ్ళారు. వాక్ స్వాతంత్రం టీవీ కార్యక్రమాలకు వర్తించదనేది ప్రభుత్వ సమాధానం. అయితే బొంబాయి హైకోర్టు ఈ వాదనను త్రోసిపుచ్చింది. పూర్తి ఇంటర్వ్యూను యథాతథంగా ప్రసారం చేయాలని ఆదేశించింది. అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి కూడా అదేవిధంగా ఉండేది. ఆనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఒక సందర్భంలో “నేనేమన్నా కాంగ్రెస్ వాడినా , అబద్ధాలు చెప్పడానికి ?” అన్న మాటలు దూరదర్శన్ లో యథాతథంగా ప్రసారమైనందుకు డైరెక్టర్ జనరల్ ను ప్రధాన మంత్రి కార్యాలయానికి ( పీ ఎం ఓ కు ) పిలిపించి మరీ క్షమాపణలు చెప్పించటం రహస్యమేమీ కాదు. రాజీవ్ గాంధీ  ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు ’తగినంత’ కవరేజ్ ఇవ్వలేదంటూ అప్పటి న్యూస్ ఎడిటర్ నర్రావుల సుబ్బారావు గారి మీద చర్యలు తీసుకోవడమూ తెలిసిందే. ( టేపులు అందిన కొద్ది నిమిషాల్లోనే బులెటిన్ ప్రసారం కావలసి ఉండటంతో మొత్తం టేపులు చూడటం కుదరక ముఖ్యమైన విషయాలకు బదులు అప్రధానమైనవి ప్రసారం చేయాల్సి వచ్చిందని ఆయన సహచరుడొకరు నాతో చెప్పారు. తెలుగుదేశం వాళ్ళతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేదనే అక్కసుతోనే చర్యలు తీసుకున్నారని కూడా అప్పట్లో చెప్పుకున్నారు) .
90లలో సంస్కరణల ప్రభావం టీవీ రంగం మీద స్పష్టంగా పడింది. అదే సమయంలో ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ మొదలయ్యాయి. సహజంగానే దూరదర్శన్ మీద మొహం మొత్తింది. టీవీ మీద ప్రభుత్వ గుత్తాధిపత్యం పోయింది. 20 ఏళ్లలో 400 చానల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో దూరదర్శన్ కూడా 1993 ఆగస్టు 15న ఒకేసారి ఐదు శాటిలైట్ చానల్స్ ప్రారంభించింది. దూరదర్శన్ చూడకపోవడం జాతివ్యతిరేకమనే ప్రచారం చేసినా ఫలితం కనిపించలేదు. తగినన్ని కార్యక్రమాలు లేకుండానే హడావిడిగా మొదలైన చానల్స్ లో అంతా గందరగోళమే. స్పోర్ట్స్ చానల్ గా పేరుపెట్టుకుని ఒక పాత సినిమాను వరుసగా మూడు సార్లు ప్రసారం చేయటం చూసిన అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు వెంటనే వాటిని మూసివేయాలని ఆదేశించారు. ఆ విధంగా ఏడాదిలోపే వాటిని మూసివేస్తూ సమాచార ప్రసారాల శాఖామంత్రి కె పి సింగ్ దేవ్ పార్లమెంటులో ప్రకటన చేశారు. ‍
ఒకవైపు ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ వినోద కార్యక్రమాలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంటే మరోవైపు దూరదర్శన్  ప్రత్యేక రాయితీలతో ముందుకు సాగాలని ఆశపడింది.  ప్రైవేట్ చానల్స్ మీద ప్రభుత్వ ఆంక్షలు కూడా పరోక్షంగా దూరదర్శన్ కు ఉపయోగపడ్డాయి. క్రికెట్ ప్రసారాల హక్కులు పొందిన చానల్ దూరదర్శన్ కు కూడా ఆ ఫీడ్ ఇవ్వాలని ప్రభుత్వం షరతు విధించింది. నిర్మాతలనుంచి సినిమా హక్కులు కొనుక్కునే విషయంలోనూ దూరదర్శన్ నియమాలు ప్రత్యేకం. కేబుల్ ఆపరేటర్లు తప్పని సరిగా ప్రైమ్ బాండ్ లో డీడీ చానల్స్ ప్రసారం చేయాలంటూ చట్టం చేసింది. ఇంకోవైపు ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ భారత భూభాగం నుండి అప్‍లింక్ చేయడానికి వీల్లేకుండా కొంతకాలం అడ్డుకుంది. ఆ విధంగా విదేశీ మారకద్రవ్యం కోల్పోవటం ఎంత అవివేకమో తెలుసుకుని ఆ తరువాత ఆంక్షలు తొలగించింది. అయితే దూరదర్శన్ మీద ప్రభుత్వ నియంత్రణ మాత్రం తగ్గలేదు. 2004 లో జయప్రకాశ్ నారాయణ్ మీద డాక్యుమెంటరీ ప్రసారాన్ని అడ్డుకుని సెన్సార్ చేసింది. జేపీ ఉద్యమానికి ప్రభావితుడై కాంగ్రెస్ నుంచి వెళ్లి జనతాపార్టీలో చేరిన జైపాల్ రెడ్డి 2004 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కూడా సెన్సార్‍షిప్ ను అడ్డుకోలేకపోయారంటే ప్రభుత్వం దూరదర్శన్ ను ఎంతగా నియంత్రించిందో  అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఏదైనప్పటికీ తనకు వ్యతిరేకంగా వచ్చే వార్తల్ని  అడ్డుకుంటుందనేందుకు చాలా ఉదాహరణలున్నాయి. అప్పట్లో అజిత్ జోగి తనకు ఇబ్బంది కలిగించే వార్తలు ప్రసారమవుతున్నట్టు తెలియగానే ప్రసారాలు నిలుపుదల చేయించేవారు. ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్ ఉద్యమం జరిగినప్పుడు వామపక్షాల ప్రాబల్యం ఉన్న ఖమ్మం జిల్లాలో తేజాటీవీ ప్రసారాలు నిలిపివేయాల్సిందిగా అక్కడి ఎస్పీ రాజారత్నం నాయుడు ఆదేశించారు. చానల్ చీఫ్ ఎడిటర్ గా నేను ఆయనకు ఫోన్ చేస్తే, ప్రభుత్వ ఆదేశాలమేరకే కేబుల్ ప్రసారాలు నిలిపివేసినట్టు స్వయంగా అంగీకరించారు. అది కూడా ప్రసారం చేసిన తరువాత ఆ విషయం ఇతర జిల్లాలకు తెలియడంతో ఒత్తిడి పెరిగి ప్రసారాలు పునరుద్ధరింపజేశారు.
మళ్ళీ దూరదర్శన్ దగ్గరికే వస్తే, ప్రైవెట్ చానల్స్ లాగా అనవసరమైన హడావిడి చేయనవసరం లేదుగాని, కనీస స్థాయిలో కూడా ప్రజల్లో విశ్వాసం పొందలేకపోవటం మాత్రం ఘోరమైన తప్పిదం. దూరదర్శన్ కు నిజమైన స్వయం ప్రతిపత్తి ఇవ్వలేని ప్రభుత్వం ఆదాయమార్గాలకోసం వెతుకుతోంది. వైఫల్యానికి అసలు కారణాల గురించి ఆలోచించకుండా హై డెఫినిషన్ పరికరాల కొనుగోలు మీద, దిజిటలైజేషన్ మీద దృష్టి సారిస్తోంది. ప్రసారాల నాణ్యతను గాలికొదిలి సాంకేతిక నాణ్యత సాధించటమే ధ్యేయంగా వేలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి సిద్ధమవుతోంది. పైగా టీవీ సెట్లకు లైసెన్స్ ఫీజు వసూలు చేసే ఆలోచన కూడా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదంతా ఎవరిని మెప్పించడానికి ?ఎక్కువమందికి అందుబాటులో ఉన్న చానల్ గా చెప్పుకుంటూ కూడా వాళ్ళని ఎందుకు మెప్పించలేకపోతున్నామో ఆలోచించకపోతే ఎలా ?   వ్యాధి నిర్థారించకుండా మందులు వాడాలనుకుంటున్న ధోరణి వలన బాగుపడేదెవరో అందరికీ తెలుసు. దూరదర్శన్ ను స్వయంగా చంపిన ప్రభుత్వమే ఇప్పుడు శవాలంకరణకు పూనుకుంటోంది. డిజిటల్ ట్రాన్స్‍మిటర్లు ఏర్పాటు చేస్తే దూరదర్శన్ బాగుపడుతుందా ? 1540 కోట్లు మాత్రం చాలామందిని వ్యక్తిగతంగా బాగుపరచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Source: bhavanarayana.co.tv

న్యూస్ చానల్స్ మార్కెట్ వాటా

(  ఆగస్టు 22 నుండి 28 వరకు  )
నెం.         చానల్ 33వ వారం  34వ వారం  35వ వారం
1 టీవీ 9 3.95 4.18 4.06
2 ఎన్ టీవీ 1.41 1.31 1.54
3 టీవీ5 1.8 1.69 1.47
4 ఈటీవీ2 1.12 1.23 1.3
5 సాక్షి టీవీ 1.34 1.19 1.22
6 జీ 24 గంటలు 0.98 1.02 1.12
7 హెచ్ ఎమ్ టీవీ 0.83 0.76 0.97
8 ఎబిఎన్ ఆంధ్రజ్యోతి 1.03 1.02 0.96
9 మహా టీవీ 0.61 0.58 0.65
10 రాజ్ న్యూస్ 0.6 0.62 0.61
11 స్టుడియో ఎన్ 0.7 0.61 0.6
12 ఐ న్యూస్ 0.48 0.54 0.58
13 జెమిని న్యూస్ 0.21 0.13 0.27

ఎప్పటిలాగే టీవీ9 మొదటి స్థానంలో ఉండగా, ఈ సారి ఎన్ టీవీ రెండో స్థానానికి ఎగబాకింది. అయినప్పటికీ మొదటి చానల్ లో రెండోది సగం కూడా లేకపోవటం టీవీ9 తిరుగులేని ఆధిక్యాన్ని చాటుతోంది. వరుసగా మూడు వారాల మార్కెట్ వాటా గమనిస్తే టీవీ 5 తగ్గుతున్నట్టు, ఈటీవీ2 కొంతమేర పుంజుకుంటున్నట్టు అర్థమవుతుంది. అదేవిధంగా జీ 24 గంటలు పెరగటం, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి తగ్గటం కనిపిస్తుంది.  రాజ్ న్యూస్ స్థిరంగా ఉండగా, స్టుడియో ఎన్ కొంత తగ్గింది. నెల రోజుల కిందటి దాకా బాగా తగ్గుతూ వచ్చిన ఐ న్యూస్ ఇప్పుడు యాజమాన్యం మారాక మళ్ళీ పుంజుకుంటున్నట్టు స్పష్టమవుతోంది.

Source: bhavanarayana.co.tv