Monday, June 14, 2010

సీ'రియల్' స్టోరీ: బెడిసి కొట్టిన టీవీ నటి డింపుల్ వ్యూహం

దాడి జరిగిందంటూ కట్టుకథ.. కనిపెట్టిన పోలీసులు
శ్రీధర్ వర్మపై దాడి కేసులో అరెస్టు
కటకటాల్లో సూత్రధారి మణి, పాత్రధారి నాగరాజు
హైదరాబాద్, జూన్ 13 : అద్భుతమైన కథ.. సూపర్ యాక్టింగ్... కానీ సినిమానేఫ్లాప్! తోటి నటుడు శ్రీధర్‌వర్మపై జరిగిన దాడిలో బుల్లితెర నటి డింపుల్ వ్యూహం బెడిసికొట్టింది. దీంతో ఆమె కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఆమెకు సహకరించిన ఇద్దరు కూడా ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. బుల్లితెర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఈ కేసు మిస్టరీని పోలీసులు నాలుగు రోజుల్లో ఛేదించారు. కూకట్‌పల్లి ఏసీపీ శరత్‌బాబు కథనం ఇలా ఉంది. ఈ నెల 8వ తేదిన టీవీ నటుడు శ్రీధర్‌వర్మపై రసాయనిక పదార్థంతో దాడి జరిగింది.


నిందితులు పారిపోయారు. శ్రీధర్‌వర్మ వెంటనే కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో తన అసిస్టెంట్ నాగరాజు(25)పై అనుమానం వ్యక్తం చేశారు. శ్రీధర్‌వర్మపై దాడి జరిగిన రెండోరోజు మరో టీవీ నటుడు డింపుల్ (28) కూడా తనపై దాడి జరిగిందని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్‌కు కారులో వెళ్తుండగా మణికొండ వద్ద గుర్తుతెలియని మహిళ రోడ్డుకు అడ్డుగా పడుకొని ఉందని, కారు ఆపి ఆమెను లేపేలోగానే ఆమె లేచి తన కళ్లలో కారం చల్లి, దాడి చేసిందని తెలిపారు.


ఆ సమయంలో డింపుల్ వెంటనే ఆమె సహాయకురాలు కూడా ఉంది. గాయపడిన డింపుల్‌ను వెంటనే ఆపోలో ఆస్పత్రిలో చేర్పించారు. తమపై దాడికి మరో టీవీ నటుడు సెల్వరాజ్ కారణమై ఉంటాడనే అనుమానాన్ని డింపుల్ వ్యక్తం చేశారు. డింపుల్, ఆమె సహాయకురాలు చెప్పే వివరాలపై పోలీసులకు అనుమానం వచ్చింది. శ్రీధర్‌వర్మపై దాడి, ఆ మర్నాడే డింపుల్‌పై దాడి... ఈ రెండు సంఘటనల వెనుక ఎవరి హస్తం ఉంది.. అసలీ సంఘటనలకు కారణమేంటన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.


ఇద్దరి ఫిర్యాదుల్లో సెల్వరాజ్ పేరు వినిపించడంతో పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. శ్రీధర్‌వర్మ ఫిర్యా దు ఆధారంగా నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. తీగలాగితే డొంకంత కదిలింది. అసలు సూత్రధారులు డింపుల్, ఆమె అసిస్టెంట్ మణి(35) అని బయటపడింది. దీంతో వారిద్దరినీ అరెస్టు చేశారు. శ్రీధర్‌పై దాడి కేసులో నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. నాగరాజుకు సహకరించిన ఆయన రూమ్మేట్ ఉదయ్ కోసం గాలిస్తున్నారు.


దాడికి కారణం ఇదీ
డింపుల్, శ్రీధర్‌వర్మ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఏదో ఒక కారణంతో పెళ్లి వాయిదా పడుతోంది. డింపుల్‌కు సినిమా ఆవకాశాలు వస్తున్నాయి. శ్రీధర్ పెళ్లికి అంగీకరిస్తూనే.. పెళ్లి తర్వాత పరిశ్రమకు దూరంగా ఉండాలని షరతు పెట్టారు. ఇది డింపుల్‌కు నచ్చలేదు. దీంతో వీరి మధ్య దూరం పెరిగింది. ఈ సమస్యను డింపుల్ ఓ రోజు తన తన అసిస్టెంట్ మణితో చెప్పుకొంది. దీంతో.. ఆమె తనకు తెలిసిన వ్యక్తులతో శ్రీధర్‌వర్మను బెదిరించి పెళ్లికి ఒప్పుకునేలా చేస్తానంది.


టీవీ షూటింగ్‌లలో వర్మ అసిస్టెంటుగా పనిచేసే నాగరాజును ఈ పనికి ఒప్పించింది. నాగరాజు తన స్నేహితుడు ఉదయ్(26) సహాయంతో మలేషియా టౌన్‌షిప్ వద్ద శ్రీధర్‌వర్మపై దాడి చేశాడు. అప్పుడు వర్మ నాగరాజును గుర్తించాడు. భయపడిన నాగరాజు ఈ విషయాన్ని మణితో చెప్పడంతో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మరో స్టోరీ అల్లారు.


కారులో వెళ్తుండగా మణికొండలో ఓ మహిళ తమ కళ్లలో కారం చల్లి దాడి చేసినట్లు పోలీసులకు డింపుల్, మణి ఫిర్యాదు చేశారు. అలా పోలీసులను పక్కదారి పట్టించాలని చూశారు. పోలీసు దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. శ్రీధర్‌పై దాడి, రాయదుర్గం ఉదంతం వెనుక ఉన్న డింపుల్, మణి, నాగరాజులను పోలీసులు అరెస్టుచేశారు. తప్పుడు ఫిర్యాదు చేసిన డింపుల్‌పై కేసు నమోదు చేస్తామని రాయదుర్గం పోలీసులు తెలిపారు. 

Source: andhrajyothy.com

No comments:

Post a Comment