Friday, October 29, 2010

పోలీసు కేసులతో ఎన్టీవీ ఉక్కిరి బిక్కిరి

హైదరాబాద్, అక్టోబర్ 27: తెలుగు న్యూస్ చానల్ ఎన్‌టివి వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. పోలీసు కేసులు ఎదుర్కొనేందుకు ఆ చానల్ యాజమాన్యం నానా అవస్ధలు పడుతోంది. ఇటీవల విశాఖజిల్లాలో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిపై అభూత కల్పనలతో కధనాలు ప్రసారం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ఇరుక్కున్న ఆ చానల్‌పై హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ మరో ఫిర్యాదును స్ధానిక నాంపల్లి కోర్టులో దాఖలు చేయడంతో ఆ చానల్ యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి చేసిన ఫిర్యాదుపై ఇప్పటికే ఈ కేసులో పెందుర్తి పోలీసులు ఇద్దరు విలేఖరులను అరెస్టు చేశారు. ఈ కేసులో మిగిలిన నిందితులను అరెస్టు చేసేందుకు పెందుర్తి నుంచి ఇన్‌స్పెక్టర్ గోవిందరాజులు ఆధ్వర్యంలోని బృందం హైదరాబాద్ వచ్చింది. దీంతో చానల్ యాజమాన్యం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో జరిగిన చర్చల్లో చానల్ చైర్మన్ నరేంద్ర చౌదరిని తప్ప మిగిలిన వారిని అరెస్టు చేయాలని హోంమంత్రి చెప్పినట్లు తెలిసింది. కాగా పెందుర్తి పోలీసులు నగరానికి వచ్చి ఎన్‌టివి యాజమాన్యాన్ని అరెస్టు చేసే విషయం స్ధానిక పోలీసులకు సమాచారం లేదని బంజారాహిల్స్ ఎసిపి రవీంద్రరెడ్డి తెలిపారు.
ఎన్‌టివి ‘మిర్చి మసాల’పై మరో కేసు
========================
ఎన్‌టివిలో రాత్రి 11.30 గంటల సమయంలో ప్రసారం చేస్తున్న మిర్చి మసాల కార్యక్రమంపై నగర పోలీసు కమీషనర్ ఎకె ఖాన్ బుధవారం నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. మిర్చి మసాల కార్యక్రమం ద్వారా అశ్లీల దృశ్యాలను ప్రసారం చేస్తూ యువతను చెడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నట్లు భావించిన సిపి ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. 1995 కేబుల్ టెలివిజన్ నియంత్రణ చట్టం కింద 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ చట్టంలోని సెక్షన్ 18 కింద ఫిర్యాదు చేసేందుకు ఒక్క కమీషనర్‌కు మాత్రమే అధికారం ఉంది. ఎన్‌టివి చైర్మన్ నరేంద్ర చౌదరి, ఔట్‌పుట్ ఎడిటర్‌తో పాటు మొత్తం ఏడుగురిపై ఫిర్యాదు చేశారు. చట్టంలోని సెక్షన్ 5 కింద ప్రోగ్రామ్ కోడ్ ఉల్లంఘన కావడంతో కోర్టులో ఫిర్యాదు చేశారు. అశ్లీల ప్రసారాలను చేస్తున్న టివి చానల్స్‌పై పోలీసులు నియంత్రణ చేసేందుకు మానిటరింగ్ కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు కొన్ని అంశాలతో సిపి ఎకె ఖాన్ ఈ ఫిర్యాదును కోర్టులో దాఖలు చేశారు. దీనిపై ఏం చర్య తీసుకోవాలన్నది కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.
కాగా టివిల్లో ప్రసారమయ్యే ఈ తరహా కార్యక్రమాలు సినిమాటోగ్రఫీ చట్టం కింద సెన్సార్ బోర్డుకు సంబంధం లేదని ఆయా వర్గాలు చెబుతున్నాయి. కేబుల్ నియంత్రణ చట్టం కింద రెండేళ్ళ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించవచ్చు. ఒక వేళ రెండోసారి ఇదే నేరాన్ని చేస్తే శిక్షను ఐదేళ్ళకు పెంచి రూ.5 వేలు జరిమాన విధించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment