Thursday, October 28, 2010

ప్రేక్షకుల ముందుకొచ్చిన సెలబ్రిటీ ‘నాచోరే’

డాన్స్ రియాలిటీ షోలకు నాంది పలికిన జీ తెలుగు వినోదంలో తన విజయ పరంపరను కొనసాగిస్తూ కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పుడు ఒక సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షోకి తెర తీసింది. ఐదు సిరీస్‌ల ‘ఆట’ విజయం తర్వాత డాన్స్ రియాలిటీ షోలను మరో మెట్టుపైకి తీసుకెళ్లే రీతిలో ‘నాచోరే’ మీ ముందుకు రానుంది. తెలుగు సినీ జగత్తులో అగ్ర హీరోలతో స్టెప్పులు వేసిన హీరోయిన్లు ‘నాచోరే’ వేదిక ద్వారా వీక్షకులను అలరించనున్నారు. ‘12 మంది రాణులు - ఒకటే కిరీటం’ అనే ట్యాగ్‌లైన్‌తో ముందుకొస్తోందీ కార్యక్రమం. ‘డాన్స్ రియాలిటీ షోలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది జీ తెలుగు ఛానెల్. డాన్స్ రియాలిటీ షోలకు ‘నాచోరే’ వినూత్న వొరవడిని సృష్టిస్తుందనటంలో సందేహం లేదంటోంది జీ తెలుగు. చిరంజీవి సరసన ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి అలరించిన కరిష్మా కొటక్, జూ.ఎన్టీఆర్‌తో ‘ఆది’ చిత్రంలో స్టెప్పులేసి మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన కీర్తిచావ్లా, ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంతో పరిచయమై కుర్రకారుతో ఈలలేయించిన తనూరాయ్ సహా 12 మంది గ్లామరస్ హీరోయిన్లు ‘నాచోరే’లో కదం తొక్కనున్నారు. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అగ్ర హీరోల సరసన నటించి, అగ్ర హీరోయిన్‌గా పేరుగాంచిన రోజా, యువ హీరోలతో ‘రింగ రింగా...’ అంటూ స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ నోబుల్ మాస్టర్ లు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ‘నాచోరే’ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ నుండి ప్రతి సోమ, మంగళ వారాల్లో రాత్రి 9గంటలకు జీ తెలుగులో ప్రసారమవుతోంది.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment