Tuesday, May 10, 2011

నారా లోకేష్‌కు చెక్, స్టూడియోఎన్‌ టీవీ చానెల్‌పై జూనియర్ ఎన్టీఆర్ కన్ను?

హైదరాబాద్: ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెత్తనంలో ఉన్న స్టూడియో-ఎన్ ఛానల్ త్వరలో హరికృష్ణ చేతిలోకి మారనుందా! అంటే అవుననే కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఛానల్ చంద్రబాబు తనయుడు లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇటీవల చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య విభేదాలు వచ్చాయనే వాదనలు వినిపించిన సమయంలో కూడా స్టూడియో-ఎన్ ఛానల్లో బాబుకు అనుకూలంగా వార్తలు వచ్చాయి. విజయవాడ విభేదాల విషయంలో సైతం వల్లభనేని వంశీని తప్పు పడుతూ దేవినేని ఉమా మహేశ్వరరావును సమర్థించిన వార్తలు వచ్చాయి. అయితే లోకేష్ ఆధ్వర్యంలో ఉన్న ఆ ఛానల్ త్వరలో జూ.ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లడం ఖాయమని వినిపిస్తోంది.

స్టూడియో-ఎన్ ఛానల్ నార్నె శ్రీనివాసరావుది. నార్నె కూతురు లక్ష్మీ ప్రణతిని ఇటీవలే జూ.ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. చంద్రబాబుతో ఎంత బాంధవ్యం ఉన్నప్పటికీ, ఎన్నేళ్ల అనుబంధం ఉన్నప్పటికీ నార్నెకు జూ.ఎన్టీఆర్ అల్లుడు అయినందున ఆయనకే ప్రాధాన్యత ఇస్తాడు. అయితే మరో ముఖ్య విషయం ఏమంటే జూ.ఎన్టీఆర్ నార్నె అల్లుడు కావడానికి ప్రముఖ పాత్ర వహించింది చంద్రబాబే. పెళ్లికి ప్రముఖ పాత్ర వహించిన బాబుకే ఇప్పుడు మామ - అల్లుళ్లు ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. అంటే ఇన్నాళ్లూ లోకేష్ కుమార్ చేతిలో ఉన్న స్టూడియో-ఎన్ ఛానల్ పగ్గాలను ఎన్టీఆర్‌కు అప్పగించే అవకాశం తప్పనిసరి. జూ.ఎన్టీఆర్ చేతిలోకి ఛానల్ రాగానే ఇప్పటికే చంద్రబాబును ఢీకొడుతున్న హరికృష్ణ బాబు ఇమేజ్ తగ్గించే అంశానికే ప్రాధాన్యత ఇస్తాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.

గతంలో రాజకీయ సమీకరణాల కోసం బాలకృష్ణ కూతురును చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. బాలకృష్ణ కూతురును కోడలుగా చేసుకొని బాలకృష్ణను ఆధిపత్య పోరు నుండి తొలగించాడు. అసలే గొడవలు అంటే పడని బాలకృష్ణ ఇప్పుడు మరింత మిన్నకుండి పోయారు. రాజకీయ సమీకరణాల కోసం బాబు ఏ ప్లాన్ అయితే వేశాడో ఇప్పుడు హరికృష్ణ కూడా చంద్రబాబు నుండి ఆధిపత్యాన్ని నందమూరి కుటుంబం వైపుకు తీసుకు రావడానికి నార్నె ఇంటికి తన తనయుడిని అల్లుడిగా చేసి చంద్రబాబును దెబ్బతీయాలని చూస్తున్నాడు. మొత్తానికి నందమూరి - నారా కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లను కలిచి వేస్తోంది.

Source: thatstelugu.oneindia.in

No comments:

Post a Comment