Monday, January 3, 2011

కర్నూల్లో మరోసారి "కేబుల్' వార్

కర్నూలు(ఇఎన్‌ఎస్): టిడిపి నేత కె.ఇ.కృష్ణమూర్తి, చిన్నతరహా నీటిపారుదల శాఖా మంత్రి టి.జి.వెంకటేష్ నడుమ తీవ్రమైన కేబుల్ వార్ మరోసారి మొదలైంది. ఒక దశాబ్దం క్రితం కె.ఇ.కృష్ణమూర్తి, వెంకటేష్ ఇద్దరు టిడిపి ఉన్న సమయంలో  కేబుల్ వార్ మొదలైంది. చివరకు కే ఈ కుటుంబం దాన్ని వెంకటేష్‌కు వదులుకోవటంతో సమరం ముగిసింది. ఒకవైపు స్థానిక సంస్థలకు ముంచుకోస్తుండగా, మరోవైపు మధ్యంతర ఎన్నికలు వస్తాయనే భయం పెనుభూతం కావటంతో స్వంతంగా ఎలాంటి కేబుల్ నెట్‌వర్క్‌ లేని కె.ఇ.కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ఒక నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తున్నారు. జనవరి ఒకటవ తేదిన ఒక కేబుల్ కంట్రోల్ రూమ్‌ను ఇక్కడ లాంఛనంగా ప్రారంభించారు.

రెండు దశాబ్దాల క్రితం కేబుల్ టీవీ నెట్‌వర్క్‌ కనెక్షన్లలో కె.ఇ.కృష్ణమూర్తి ఇష్టారాజ్యం సాగేది. కె.ఇ. కుటుంబానికి చెందిన మహాలక్ష్మీ కమ్యూనికేషన్స్ 2002 సంవత్సరం దాకా 10 ఏళ్ళపాటు ఆ వ్యాపారాన్ని ఏక చత్రాధిపత్యంగా ఏలింది. కేఈ నుంచి విడిపోయిన వెంకటేష్ స్వంతంగా ఒక నెట్‌వర్క్‌ ప్రారంభించారు. ఒక కేబుల్ కనెక్షన్‌కు నెలకు రూ.100గా ఉన్న కాలంలో రూ.10కి కనెక్షన్ ఇవ్వటం ద్వారా 2003 సంవత్సరంలో వెంకటేష్ కె.ఇ.కృష్ణమూర్తి వ్యాపారాన్ని చావుదెబ్బ తీసారు. అంత తక్కువ ధరకే కనెక్షన్ వస్తుండటంతో ప్రజలు  అతిస్వల్ప కాలంలోనే టి.జి.వెంకటేష్ నెట్‌వర్క్‌కు మారిపోయారు. మెరుపుదాడికి నిలబడలేకపోయిన కేఈ సోదరులు పత్తికొండ ఎమ్మెల్యే ఎస్వీ.సుబ్బారెడ్డికి వారి కంపెనీని విక్రయించారు. శ్రీసాయి కమ్యూనికేషన్స్ పేరిట నెట్‌వర్క్‌ను తిరిగి ప్రారంభించిన సుబ్బారెడ్డి... అందులో వెంకటేష్‌ను భాగస్వామిగా చేసుకున్నారు. ఎస్వీ.సుబ్బారెడ్డి, టిజి ఉభయులు కూడా వారి కార్యకలాపాల ప్రచారం కోసం కేబుల్‌ను వాడుకోసాగారు. నగరంలో వారి కంపెనీకి దాదాపు ఒక లక్ష కనెక్షన్లు ఉన్నాయి.

వారి రాయకీయ ప్రోయోజనాలను కాపాడుకునేందుకు ఒక కేబుల్ నెట్‌వర్క్‌ అవసరాన్ని గుర్తించిన కేఈ సోదరులు వారి స్వంత నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తున్నారు.

ఇదిలా ఉండగా కేఈ నెట్‌వర్క్‌ ఇన్ ఛార్జ్ కేఈ సత్యనారాయణ మాట్లాడుతూ నెల రోజుల్లోగా కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. ఆపరేటర్లకు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న రేటు కన్నా రూ.20 తక్కువకు ఖాతాదారులకు కనెక్షన్లు ఇస్తామని వెల్లడించారు.

తక్కువ ధరకు కేబుల్ కనెక్షన్ దొరకటంతో పాటుగా, వైరి పక్షాల నడుమ పోరు ప్రజలకు లబ్ది చేకూరుస్తుందనే ఆనందంలో నగర ప్రజలున్నారు.

Source: www.apweekly.com

No comments:

Post a Comment