Tuesday, February 22, 2011

ఇండియన్‌ రియాలిటీ షోలో జెన్నిఫర్‌ లోపెజ్‌

ఇండియన్‌ టివి రియాల్టీ షోలు నేడు అంతర్జాతీయ గుర్తింపును సాధించాయి. వివిధ టివి ఛానెల్స్‌ లో ప్రస్తుతం కొనసాగుతున్న రియాల్టీ షోలు ఎంతో పాపులారిటీ పొందాయి. ఇటీవలే బిగ్‌బాస్‌ -4 రియాల్టీ షోలో హాలీవుడ్‌ సెలబ్రిటీ పమేలా ఆండర్సన్‌ అతిథిగా పాల్గొని కనువిందుచేశారు. ఆమె ఈ షోకే హైలైట్‌గా నిలిచి బుల్లితెర ప్రేక్షకులను మైమరపించారు. ఈ నేపథ్యంలో పాప్‌ సింగర్‌, సెలబ్రిటీ జెన్నిఫర్‌ లోపెజ్‌ ఓ ఇండియన్‌ టివి రియాల్టీ షోలో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ‘ఎక్స్‌-ఫ్యాక్టర్‌’ మ్యూజికల్‌ రియాల్టీ షో ఎంతో హిట్‌ అయ్యింది.

ఆ రియాల్టీ షోకు దేశీ వర్ష న్‌గా ఓ రియాల్టీ షో మన దేశంలోని ఓ టివి ఛానెల్‌లో త్వరలో ప్రసారం కానుంది. ఈ రియాల్టీ షోకు హాలీవుడ్‌ సెలబ్రిటీ జెన్నిఫర్‌ లోపెజ్‌ (జెఎల్‌ఒ) జడ్జీగా తీసుకోనున్నట్టు తెలిసింది. ‘యుఎస్‌ రియాల్టీ షో ఎక్స్‌-ఫ్యాక్టర్‌ జడ్జీల ప్యానెల్‌లో జెఎల్‌ఒను కూడా తీసుకోనున్నారు. కానీ ఈ షో ఇండియన్‌ వర్షన్‌లో జెన్నిఫర్‌ చేసే అవకాశాలు కొద్దిగా మాత్రమే ఉన్నాయి’ అని ఓ హాలీవుడ్‌ ప్రముఖుడు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియన్‌ టివి ఛానెల్స్‌లో ఎక్కువగా రేటింగ్‌ కలిగిన రియాల్టీ షోలలో రానున్న రోజుల్లో మరింత మంది హాలీవుడ్‌ సెలబ్రిటీలు పాల్గొననున్నారు. 
 
పమేలా ఆండర్సన్‌ బిగ్‌బాస్‌లో అతిథిగా వచ్చి ఈ సెల బ్రిటీలకు మార్గం సుగమం చేశారు. ఆమె తర్వాత జెన్నిఫర్‌ ఇండియన్‌ రియాల్టీ షోలో కనిపిస్తే మరింత మంది సెలబ్రిటీలు ముందుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ‘ఇండియన్‌ రియాల్టీ షోలకు నేడు మంచి ఆదరణ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలు కూడా ఈ షోలను తిలకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ షోలకు జడ్జీలుగా హాలీవుడ్‌ సెలబ్రిటీలను తీసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పలువురు హాలీవుడ్‌ సెలబ్రిటీలు రియాల్టీ షోలలో కనువిందుచేస్తారు’ అని టివి యాంకర్‌ శేఖర్‌ సుమన్‌ పేర్కొన్నారు. వివాదాస్పదంగా మారుతున్న రియాలిటీ షోలలోకి విదేశీ సెలబ్రిటీలను కూడా తీసుకు వస్తే టీఆర్‌పి రేటింగులు విపరీతంగా పెరుగుతాయని ఛానెళ్ళు ఆశిస్తుండచ్చు. అయితే ఇటువంటి షోలు, వివాదాల వల్ల యువతపై, పిల్లలపై దుష్ర్పభావాల గురించి ఆలోచించక పోవడమే విచారకరం.

Source: www.suryaa.com

No comments:

Post a Comment