Tuesday, February 22, 2011

బుల్లితెరపై ‘జాక్‌పాట్’

సూరత్ సుందరి నమితను ‘జాక్‌పాట్’ అవకాశం వరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నమితకు ఇది పెద్ద సవాల్‌లాంటి చాన్స్. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ముంబయ్ బ్యూటీ ఖుష్బూ వ్యాఖ్యాతగా వ్యవహరించి తమిళ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేశారు.

జయ టీవీలో ప్రసారమైన ఈ ‘జాక్‌పాట్’ షోకి టీఆర్పీ రేటింగ్ భారీ
ఎత్తున ఉండేది. ఎడీఎంకె అధ్యక్షురాలు జయలలితకు సంబంధించిన చానల్ ఇది. కాగా.. డిఎంకె పార్టీతో ఖుష్బూ చేతులు కలపడంతో జయలలిత ఆగ్రహానికి గురై జాక్‌పాట్ నుంచి ఆమెను తీసేశారు. ఆ స్థానంలో నదియాను తీసుకున్నారు. కానీ ఖుష్బూ రేంజ్‌లో నదియా ఆకట్టుకోలేకపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్పీ రేటింగ్ భారీ ఎత్తున పడిపోయిందట. ఆ కారణంగా నదియా స్థానంలో వేరే తారను తీసుకోవాలని జయ టీవీ భావించింది.

బొద్దుగుమ్మ నమిత అయితే ‘జాక్‌పాట్’కి పూర్వ వైభవం వస్తుందని భావించారట. తమిళీయులకు బొద్దుగా ఉండే నాయికలంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో నమితకు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్ ‘జాక్‌పాట్’కు బాగా ఉపయోగపడుతుందని చానల్‌వారు భావిస్తున్నారు. ఇప్పటికే నమిత ‘మానాడ మైలాడ’ అనే షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. బుల్లితెర వీక్షకులు నమితకు బాగానే నీరాజనాలు పడుతున్నారు. ‘జాక్‌పాట్’కు తనని ఎన్నుకోవడానికి ఇది కూడా ఒక కారణం అని పరిశీలకులు అంటున్నారు. నమిత కూడా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి పచ్చజెండా ఊపారట. బొద్దుగా ఉండే ఖుష్బూ జాక్‌పాట్‌కి నిండుదనం తెచ్చినట్లే నమిత కూడా తీసుకువస్తారనే అంచనాలు ఉన్నాయి. మరి.. నమిత ఆ అంచనాలను చేరుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.

Source: www.sakshi.com 

No comments:

Post a Comment