Wednesday, February 16, 2011

నేడు టీవీ ఎడిటర్లతో ప్రధాని ముఖాముఖి

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ బుధవారం టెలివిజన్ చానళ్ల ఎడిటర్లతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రసారంలో వారు అడిగే పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిస్తారు. 2జీ స్పెక్ట్రమ్, కామన్వెల్త్ క్రీడలు, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ, ఎస్-బ్యాండ్ కుంభకోణాలతో సతమతమవుతున్న యూపీఏ సర్కారుపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో మీడియాతో ఈ తరహా కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. వరుసపెట్టి ఒక్కటొక్కటిగా కుంభకోణాలు బయటపడుతున్నా పెదవి విప్పని ప్రధాని.. ఈ ముఖాముఖి ద్వారా అన్ని సందేహాలను పటాపంచలు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అవినీతిని అరికట్టడానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గురించి కూడా ఆయన వివరించే అవకాశం ఉందని తెలిపాయి. ఇక్కడి రేస్‌కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ ప్రత్యక్షప్రసారం చేస్తుంది. ప్రధాని గతేడాది సెప్టెంబర్‌లో ప్రింట్ మీడియాకు చెందిన సీనియర్ ఎడిటర్లతో సమావేశమై, వారు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

Source: www.sakshi.com/

No comments:

Post a Comment